Total Pageviews
Thursday, December 31, 2015
Thursday, December 24, 2015
Thursday, December 17, 2015
ఏమి తినాలి .. ?
భర్తకి పిల్లలకి , రుచికరమైన ,ఆరోగ్యకరమైన భోజనం వండి పెట్టాల్సిన బాద్యత ఇల్లలిదే అంతేకాదు తను కూడా
ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతోవుంది . కానీ దొరికేవన్నీ కల్తీ వని తెలిస్తే ... ''ఏమి తినాలి ..? ''.
ఆకుకూరలు తింటే చాల మంచిదంటారు ఆరోగ్యానికి ,కళ్ళకి ,చర్మానికి కాని ఏది మురికినీళ్ళు మడిలోనికి
మళ్ళించి పెంచే ఆ ఆకుకూరలా ?ఆరోగ్యానికా అనారోగ్యానికా ? పండ్లు తింటే పీచు తగిన తీపి అందుతుంది ,
తీపి పదార్ధాలకు దూరంగా ఉండచ్చుట ,వయసైనా సొగసు భద్రంగా ఉంటుందట ,ఏదీ మాత్రలతో మగ్గించి
పొగతో పండించేవి [అరటిపళ్ళు ], పౌడర్ తో పండించేవా ! పుచ్చాకయలో ఎరుపురంగు ఇంజెక్ట్ చేస్తారట ?
ఏపిల్ పళ్లకు నిగ నిగలడేందుకు ఏదో [హాని కరమైన ] నునె కూడా రాస్తారట మెరవడానికి . ద్రాక్షపళ్ళ
గురించి మనందరికీ తెలిసిందే మందు చల్లుతారని ,అందుకే గొంతుపట్టేస్తుంటుంది ,నీళ్ళు వేడి చేసి ఉప్పు
వేసిపండ్లని రెండుగంటలుంచి తింటుంటాము . కూరగాయలు పండించేవాళ్ళు ఏమేమి వాడుతారో ,ఏవిధంగా
శుభ్రం చెయ్యాలో మనందరికీ తెలిసిందే . కూరగాయలు కడగటానికి లిక్విడ్స్ వచ్చేసాయంటే చుడండి మరి .
చేపలు మురుగు కాల్వలో పెంచుతున్నారని న్యూస్ లోనే చెప్తున్నారు . కేట్ ఫిష్ ఐతే చాల ప్రమాదమట .
చేపలు ఎంపిక చెయ్యడమే కష్టం ,అందులో మళ్లీ ఇదొకటి , కళ్ళకి మంచిది ,తెలివితేటలు పెరుగుతాయి
పిల్లలకు పెట్టండి అంటారు ఇవా పెట్టేది ?. కోడిగుడ్డు నాటుకోడి ఐనా ఫారం కోడి ఐనా ఒకటే బలం అట
కాని నాటు కోడి గుడ్డు ఎక్కువ ధర ఇచ్చి తెస్తాము ,ఎంపిక కోసం పెంకు కొంచెం ఎక్కువ రంగు వుంటే
అదే గుడ్డు కొంటాము ,కాని మామూలు గుడ్డునే టీ డికాక్షన్ లో వేసి తీసి ఉంచుతారట ? కోడికైతే ఎన్ని
ఇంజెక్షన్ ఇస్తారో లేక్కేలేదట కోళ్ళ ఫారం లో .. మీరుకూడా చూసే వుంటారు . ఈమధ్య దొరికిన కల్తీ
పదార్ధాలు ,వార్తల్లో చూపిస్తున్నారు . అల్లం వెల్లుల్లి పేస్టు ,నెయ్యి, గరం మాసాల పేకిట్లు ,పసుపు ,
బెకేరి లలో వాడె సాస్ లు ఏది వదిలి పెట్టడం లేదు .
పాలుతాగుదామంటే పాలకోసం గేదేకి కూడా ఇంజెక్షన్ లే ఆ తీసిన పాలల్లో కూడా ,పౌడర్లు ,పామాయిల్
కలుపుతారట , నూనె ఐతే జంతుకళేబరాలతో ,కొవ్వులతో కాచిన నూనెలు అమ్ముతున్నారు . ఫాస్ట్ ఫుడ్
వాళైతే మొత్తంగా అదే నూనె వాడుతున్నారట . ఆ కొవ్వుల వల్లనే ఆ ఫుడ్ కి అంత రుచి .అందరం ఆర్గానిక్
ఫుడ్ అంత ధరపెట్టి కొని తినగలమా !పప్పులు బియ్యము కూడా త్వరలో సిలికాన్ వి వస్తాయట . ఇన్ని
అనారోగ్య కారకాలని భోంచేస్తూ ,ఇవి చాలవన్నట్లు మన అలవాట్లు ఒకటి ,కావలసినంత కడుపులోకి
పుచ్చుకుంటారు కాని పిల్లలకి తినడానికి ఇంటికి తీసుకు వెళ్ళేవాళ్ళు చాల తక్కువ . ఏషాపు దగ్గరా
లేనంత రద్దీ ''ఆ'' షాపు దగ్గర , ఇక అదికూడా విషమని ఎప్పుడో తెలియడం కాదు వెంటనే తెలిసిందిగా
మొన్న . ఇక నములుతారు చూడూ .. పక్కనించి వెళ్తేనే కళ్ళు మండి పోతాయి ఆ వాసనకి ,మరి అది
కడుపులో ఎలా పనిచేస్తుందో వాళ్లకి తెలీదా ? ఆ నమిలే వాళ్ళంతా ఒక్కసారిగా అనుకుని ఊసారంటే ..
నగరం కొట్టుకు పోతుంది . ఆఖరికి దేవాలయం క్యూ లో కూడా అవే మరకలు . శుభ్రత పాటించండి
అని బోర్డు పెట్టగలరు కాని ,మూతిమీద వాత పెట్టలేరుగా ! మనకుండాలి ఎక్కడ వున్నాం ,ఎం చేస్తున్నాం
అని . వూదేవి ఉండనే వున్నాయి .
వీటన్నిటిని మించి భయంకర మైనది ,బాధ కలిగించేది ఒక విషయం రాయక తప్పడం లేదు . మా ఇంటి
దగ్గరలో ఒక పెద్దబావి వుంది . అందులోనించి నీరు టాంకర్ ల ద్వారా హోటళ్ళకి ,అపార్ట్ మెంట్లకి వెళ్తుంది
కాని అందులో ఒకతను పడి మరణించాడు . అతనిని వాళ్ళ వాళ్లకి అప్పగించే ప్రక్రియ కొనసాగుతూనే
వుంది ... మరో ప్రక్క అదే బావినించి నీరు తీసుకుని టాంకర్ లు వెళ్తూనే వున్నాయి !!!!!??????????.
**************************************************
Thursday, December 10, 2015
పాత కధలే .......
అత్యాశ ,దురాశ ,ఈర్ష్య ,అసూయ పేరేదైనా మనిషిని దహించడం లో ఈ లక్షణాలు వేటికవే సాటి . చదివినవే ఐనా
మరొక్కసారి ! ఒక రాజుగారు పౌరులందరికీ భూమి ఇవ్వాలనుకుంటారు . ఇంతని కాకుండా ప్రొద్దు గుంకేలోగా
ఎవరెంత దూరం వెళ్లి ,తానున్న చోటికి తిరిగి వస్తారో ,అంతమేరా భూమి వారికిస్తానంటారు . ఒక దురాశా పరుడు
మాత్రం ,పరుగు పెడుతూనే వుంటాడు . ఎంత అంటే తిరిగి రాలేనంత ,తిరిగివచ్చే ఓపికలేక శోష వచ్చి అక్కడే
పడిపోతాడు . భూమి పోయే ... ప్రాణం పోయే ....
మరొక కధలో రాజు గారు బొగ్గుల వ్యాపారిని చూసి జాలి పడతారు . మంత్రిగారి తో తమ పండ్లతోటని ఆ వ్యాపారికి
రాసి ఇవ్వాల్సిందని చెప్తారు . కాని మంత్రిగారు ఒకటే అంటారు ,' కష్టపడకుండా వచ్చిన దానిని సద్వినియోగం
చెయ్యరు ప్రభూ కావాలంటే నిరూపిస్తాను ' అని ఆ బొగ్గుల వ్యాపారిని పిలిచి 'ఈ తోటనంతా నీకు దానంగా ఇస్తే
ఏమిచేస్తావు' అని అడిగితే అపుడా వ్యాపారి మంత్రి గారితో తన వ్యాపారధోరణి లో [కాచే పూచే ]తోటని తగులబెట్టి
బొగ్గుల వ్యాపారం చేస్తానంటాడు . రాజుగారికి జ్ఞానోదయం అవుతుంది . మనకుంది కదా అని అపాత్రదానం చెయ్య
కూడదని తెలుసుకుంటారు .
ఉదయాన్నే ఒకరోజు భక్తీ ఛానల్ లో ఒక కధ చెప్తున్నారు ,ఒక బెల్లం వ్యాపారి నలుగురు సాధువులను పిలిచి
భోజనం పెడతాడు . భోజనానంతరం నలుగురికి నాలుగు బెల్లం కుందులను ఇస్తాడు . ముగ్గురు సాధువులు
తృప్తిగా వెళ్ళిపోతారు . ఒక సాధువు బెల్లం మాత్రం కుక్క ఎత్తుకేళ్తుంది . దాంతో విచారంగా అక్కడే కూచుని
ఉంటాడు . బెల్లంవ్యాపారి విషయం తెల్సుకుని ,మరో బెల్లం కుందు ఇస్తాడు . ఐనా సాధువు అలాగే ఉంటాడు .
వ్యాపారి అడుగగా మీరిచ్చిన కుందుతో పాటు మొదటిది కూడా వుంటే బాగుండేది అంటాడు . [అది పోవడం
వల్లనే కదా ఇదివచ్చింది ?] సరే అని వ్యాపారి మరోటి ఇస్తాడు . ఐనా అతనలాగే ఉంటాడు . మరో యాభై
ఇచ్చినా అతను తృప్తి పడడెమో ! తృప్తి అనేది మనసుకు సంబందించినది . మనకన్నా తక్కువ వాళ్ళని
చూస్తే మనకేమి వున్నాయో తెలుస్తుంది ఆనందం కలుగుతుంది . అదిమానేసి లేనిదానికోసం ఏడుస్తూ,
కూచుంటే ఉన్న మనశ్శాన్తి పోతుంది
ఒకసారి గాంధీజీ వద్దకు ఒకాయన ఒకఅబ్బాయిని తీసుకుని వస్తాడు . 'మావాడు వేయించిన పల్లీలు
[వేరుసేనగలు ] బెల్లం కలిపి తింటున్నాడు ,అదికూడా చాల ఎక్కువగా ,మీరే అతనికి నచ్చచెప్పాలి అంటాడు .
గాంధీజీ ఆ అబ్బాయిని వారం తర్వాత తీసుకు రమ్మని చెప్పారు . వారం తర్వాత అతను అబ్బాయి తో సహా
మళ్లీ వస్తాడు . అపుడుగాంధీజీ ఆ అబ్బాయి తో పల్లీలు బెల్లం కలిపితినవద్దని అది ఆరోగ్యానికి అంత మంచిది
కాదని చెప్తారు . అబ్బాయి వెంట వచ్చిన వ్యక్తి మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే చెప్పివుండచ్చు కదా అని
అడుగుతాడు ,అప్పుడు గాంధీజీ చెప్పారట ''నేనూ అదేపనిగా బెల్లం పల్లీలు కలిపితింటాను నేనుతింటూ
అతనికి వద్దని ఎలాచెప్పగలను ?ఈ వారం రోజులుగా ఈ అలవాటు వదులుకోవడం వల్లే అతనికి చెప్పగలిగేను ''
అన్నారట . నిజమే ఏదో సలహా అంటే ''పడేస్తాంఉచితంగా ''అంతే కాని మనం పాటించే చెప్పాలంటే కష్టం కదా !.
******************************
Thursday, December 3, 2015
విశాఖతీరం
గోదావరి తో ఉన్న అనుబంధం కన్నా మించిన బంధం సముద్రం తో వుంది . పుట్టింది పెరిగింది అంతా సముద్రతీరం
అందుకే పెద్దగా ఆలోచించ కుండానే 'సాగరతీరం ' అని బ్లాగ్ పేరుపెట్టు కున్నాను . చిన్నతనంలో అత్తయ్య వాళ్ళు
వచ్చేవారు . సంక్రాంతికి ,వేసవి సెలవులకి అప్పుడు తప్పనిసరిగా బీచ్ కి వెళ్ళేవాళ్ళం . చాలసరదాగా గడిచేది .
నాపెళ్ళి కాగానే మేము ఆగస్ట్ పదిహేను రోజు వైజాగ్ లో కాపురం పెట్టాము . పాపం ఆరోజే ఈయనకి స్వతంత్రం
పోయింది ?????!!!!!!!!!!!! , నాకు అదేరోజు స్వతంత్రం వచ్చిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను .
నెలలో మొదటి ఆదివారం '' రిచ్చి'' గా 'దసపల్లా 'లో భోంచేసే వాళ్ళం {గోల్డెన్ వీక్ }. అక్కడినించి రిషికొండ వెళ్లి
బీచ్ ఒడ్డున గడిపి సాయంత్రమెప్పుడో వచ్చేవాళ్ళం. రెండో ఆదివారం జగదాంబ దియేటర్ లో సినిమా చూసి మళ్ళీ బీచ్ {సిల్వర్ వీక్ ] .మూడో ఆదివారం {కాపర్ వీక్ } ఎవరన్నా స్నేహితుల ఇంటికి [కేవలం సాయంత్రాలు] నాలుగో ఆదివారం {జర్మన్ సిల్వర్ వీక్ } డబ్బులైపోయేవి ?????!!!!!!.'' కేవలం '' బీచ్ కి '' మాత్రమె వెళ్లి మామిడికాయ ముక్కలు , ఐస్ ప్రూట్ , అలావుండేది . ఇలా లాభం లేదు అని నేను ఫైనాన్సు మినిస్టర్ అవతారంఎత్తాను . మేమిద్దరం ఆదర్శాలు వంకాయలు అంటూ పెద్దవాళ్ళ [ఆర్దిక ] సాయం లేకుండా
జీవితం మొదలుపెట్టాము , సంసారం పెద్దదయ్యాక తెలిసింది'' ఆదర్శాలు వంకాయలని '' ఏమిచేస్తాం
ఒకసారి మాట అనుకున్నాక కట్టుబడి వున్నాము . ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి
వేసేది మా గుర్రం , ఇప్పుడు పంచకల్యాణి అనుకోండి .. కాని ఎంతైనా ఎవ్వరి సాయం లేకుండా పైకి
వస్తే ఆ ఆనందమెవేరు .. నేను సింహం లాంటిదాన్ని ,అది జడవేసుకోదు ,నేనువేసుకుంటాను ,అంతే తేడా !
మిగతాదంతా సే మ్ టూ సే మ్ ....
ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతి పౌర్ణమికి తప్పనిసరిగా బీచ్ కి వెళ్ళేవాళ్ళం . ఎంత బావుంటుందో తెలుసా !చూడటానికి రెండుకళ్ళు సరిపోవు . ఒకపక్క సూర్యుడు అస్తమించగానే నీలి రంగు సముద్రం లోనించి చంద్రుడు
పైకి లేస్తాడు నారింజ రంగు బంతిలా....... నిముష నిముషానికి పైకి లేస్తున్న చంద్రుడిని చుస్తే అలా చూస్తూనే
ఉండిపోవాలనిపిస్తుంది .నీలిరంగు కెరటాలు తీరాన్ని డీ కొట్టి తెల్లని నురగలు గా విడిపోతూ ,ప్రశాంత మైన వాతావరణం లో లయబద్దమైన హోరు .. అదొక అద్భుతం అంతే వర్ణించడానికి మాటలే రావు . ఎంత రాత్రి ఐనా ఇంటికి వెళ్ళాలనిఅనిపించనే అనిపించదు . ఇప్పటికీ వైజాగ్ ప్రయాణం అంటే దగ్గరలో పౌర్ణమికి ఉండేలా ప్లాన్ చేస్తాను .
ఇప్పుడైతే'' హుసేన్ '' సాగర్ ''తీరం '' చేరాము కాని ,అప్పుడు ఆరోజులే వేరు అన్పిస్తుంది , ఒకసారి హైదరాబాద్
వచ్చాము అత్తయ్య ఇంటికి , నాంపల్లి ఎగ్జిబిషన్ చూడటం ,నడవలేక రైల్ ఎక్కడం కతలు కతలుగా చెప్పుకునే
వాళ్ళం స్నేహితులకి ,ఆ టైం లోనే ''హుసేన్ సాగర్ ''లో పడిపోయిన బుద్దుడిని వెతికి పట్టుకుని సాగర్ మధ్యలో
నిలబెట్టారు ,చిన్న చిన్న మెరుగులు కోసం తలచుట్టూ వేదికలా కట్టి పైవరకు వెళ్లి పనివాళ్ళు పనిచేసే వారు అపుడు
అత్తయ్య అక్కడ సివిల్ ఇంజనీర్ గా వుండేది పై వరకూ అంటే బుద్దుడి తలవరకూ ఎక్కి పనుల పర్యవేక్షణ చేసేది .
మేము కూడా బోటు లో వెళ్లి, పై వరకు వెళ్లి చూసాం భలే వుంది , సిటీ మొత్తం కనబడుతుంది . కాని దిగే టప్పుడు
మాత్రం బాగా భయమేసింది , అసలే అరవై అడుగుల ఎత్తు, ఎక్కేటప్పుడు తెలియలేదు దిగే టప్పుడు మాత్రం అరుస్తూ ,భయంతో ఎంత గోల చేసామో చెప్పలేను . ఒకోసారలా... ట్యాంక్ బండ్ వేపు వెళ్ళినప్పుడు నవ్వొస్తుంది .
*******************************************************************
Thursday, November 26, 2015
గోదావరితీరం .
అందాల అడవిలో అన్నీ విశేషాలే , అక్కడవుండేది కేవలం అటవీశాఖ ఉద్యోగులు ,గిరిజనులే ,ఇప్పుడు అక్కడకూడా చాలమార్పులు జరిగాయనుకోండి అదివేరేవిషయం . మేమున్నప్పుడు మాత్రం చాల చాల
సరదా గా గడిపేవాళ్ళం . అందరం కార్తీకవనభోజనాలకి వెళ్లి ఎంత సరదాగా గడిపేవాళ్ళ మో గతంలో రాసాను. కొన్ని సార్లు ఆడవాళ్ళు మాత్రం పిల్లల్ని తీసుకు బయల్దేరేవాళ్ళు ,అందులో కూడా చాల ఉత్సాహ
వంతులు వున్నారు ,కాస్త బద్దకించి ,లేదా తెలియనిచోటు ఎందుకులే అనుకుని ఊరుకునే వాళ్ళని ,
ఉత్సాహపరిచి పిల్లలతో సహా ప్రయాణం కట్టించేవారు . మగవాళ్ళు కూడా వద్దనకుండా , ఎవరో ఒకరిని తోడిచ్చి పంపేవారు . రంప చోడవరం లో'' రంపలో '''శివుని ఆలయం వుంది,అక్కడికి ఒకసారి ,పాములేరు బ్రిడ్జ్ మరోసారి ఆచుట్టుపక్కల మరికొన్ని మంచి ప్రదేసాలువున్నాయి అవీ , ఒకసారి
సీలేరు పవేర్ ప్రాజెక్ట్ చూసి వస్తే ,మరోసారి భద్రాచలం (లాంచిలో ) వెళ్ళేవాళ్ళం . ఒక్కరోజులో వెళ్లి రావచ్చు .
సినిమాలో లాగా రోజుల తరబడి వెళ్లి రానక్కరలేదు . ఇంకోసారి మారేడుమిల్లి వెళ్తే (ఎన్నిసార్లు వెళ్ళామో లెక్కే
లేదు ) ఒకసారి దేవీపట్నం వెళ్ళే వాళ్ళం ,కాని నాకు మాత్రం మారేడుమిల్లి లో ట్రావెల్స్ బంగ్లా ,దేవీపట్నం లో
గుడి చాల నచ్చేసాయి . గోదారి వడ్డున చాల పెద్ద చెట్టు వుంటుంది ,ఎడమ పక్క పోలిస్ స్టేషన్ వుంటే, కుడి
పక్క గుడి వుంటుంది ,మెట్లు అన్నీ పరుగులు పెడుతూ ఎక్కుతుంటే మెట్లకిరువైపులా పొగడపూలు చెట్లు
విరగపూసిన పూలతో స్వాగతం పలికేవి ,రాలిన పూలన్నీ ఏరుకుంటూ వెళ్ళేవాళ్ళం . పైన పెద్ద ఆంజనేయ
స్వామి విగ్రహం వుండేది . అది అందాలరాముడు సినిమా షూటింగ్ కోసం పెట్టారని ,ఈగుడినే భద్రాచలం లా
చూపించారని చెప్తారు . దర్శనం తర్వాత దిగివచ్చేవాళ్ళం ,అప్పుడు కేరేజ్ విప్పి అందరం టిఫిన్లుతినేవాళ్ళం
ఆవ పెట్టిన పులిహోర , గడ్డపెరుగు .అరటికాయ బజ్జీలో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వుంచి నిమ్మకాయ పిండి
ఇచ్చేవారు . అందరం ఆచేట్టుచుట్టు ఉన్న గట్టు మీదకుర్చుని లాగించేవాళ్ళం . మెల్లిగా కిందకి జారుతున్నట్లుగా ఉన్న గోదారి లోకిదిగేవాళ్ళం ,కాళ్ళు కడుక్కుంటు న్నట్లుచేస్తూ, సగానికిపైనేతడిసే వాళ్ళం ,ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ,ఆ చెట్టుమీరు చాల సినిమాల్లో చూసేవుంటారు .
ఈమధ్య వెళ్ళినపుడు మా కజిన్ ,అక్కడి పోలవరం ప్రాజెక్ట్ వస్తే చూడలేక పోవచ్చు ,ఇప్పుడే చూద్దాంఅని
తను తీసుకువెళ్ళింది . భార్యాభర్తలు ఇద్దరూ అక్కడ మంచి ఉద్యోగాలలో వున్నారు. అందరం కలిసివెళ్ళడం
ఒక ఆనందం ఐతే వెళ్ళాక ,గండిపోచమ్మ గుడిలోదర్శనం చేసుకుని ,కిందికి గోదావరి దగ్గరకి వెళ్ళాము . వెళ్ళాక మనసాగక స్నానాలు చేసేసాము అన్నయ్య వాళ్ళు ఎంతచెప్పినా వినలేదు ,సమయం ఎలాగడిచిందో తెలియలేదు . చీకటి పడుతోందని అప్పుడుబయటికి వచ్చాము . బట్టలవి తెచ్చుకోలేదు కాబట్టి ,కారుల్లోసీట్స్ మీద వున్న టర్కీ టవేల్స్ తెచ్చి ఇచ్చారు . పిల్లలు కూడా మాతో పాటే ఎంత అల్లరి చేసారో ......
గోదావరి తో ఉన్న అనుబంధం ఎంతో గొప్పది . ఆ గలగలలు వినని చెవులేందుకు ,ఆ అలలలో తడవని తనువెందుకు ,గోదావరిఅందాన్ని ఆస్వాదించని మనసెందుకు , గోదావరి చూడని మనమెందుకు అనిపించక
మానదు . (కొంచెం ఎక్కువైందా ? అయినా ఫర్లేదు గోదావరి గురించి కనుక ఆ మాత్రం వుండాలి ).
పుట్టింది పెరిగింది అంతా ''సాగరతీరం '' కనుక సముద్రం అంటే నాకు మరీ ఇష్టం . పెళ్లికాగానే వెళ్లి వున్నది
వైజాగ్ కనుక వైజాగ్ తో ,అక్కడి సముద్రంతో మరింత అనుబంధం వుంది .
''కార్తీకమాస వనభోజనాలు '' ఈ లింక్ ద్వారా చదవండి ..
http://anjalitanuja.blogspot.in/2014/11/blog-post.html
****************************************************************
Thursday, November 19, 2015
కొబ్బరి అన్నం .
ఇదేమిటి కొత్తగా ! వంటలూ ? అనిమీరనుకుంటున్నారని నాకు తెలుసండి ,కాని ఏమిచేస్తాం , పరిస్తితుల ప్రభావం .
అసలే కార్తీకమాసం కూరగాయాలు అదేనండి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏదో త్వరగా
అయిపోతుంది కదా అని ' పప్పు టమాటా ' వండుకుందాం అంటే , అబ్బో 'పప్పు టమాటా' నే ఈమె బాగారిచ్చి కాబోలు అనుకుంటున్నారా అంతలేదండి ,అలాంటివి '' ప్రముఖులు '' తినే వంటలు . కనుక మన పరిధిలో ఒక
అద్భుత మైన వంట ,ఈ నెలంతా వెజ్ భోజనం మాత్రమె చేస్తాం కాబట్టి , భక్తీ తో మనం కొట్టే కొబ్బరి వాడెయ్యాలి
కాబట్టి అన్నివిధాల ఈ వంట ఉపయోగం ,అంతే కాదండి ఈమధ్య కిట్టి పార్టి లో తిన్నవాళ్ళలో ఇద్దరు పోన్ చేసి
మరీ అడిగారు ఎలాచేసారండి అని అందుకే మీరు కూడా ప్రయత్నిస్తారని ఒకచిన్న ఆశ .
చాలా''తక్కువ'' మషాలా లు వాడుతూ చేసుకోవచ్చు . మీరు చెయ్యాల్సింది కొబ్బరి మిక్సి లో వేసి పాలు తీసి
పెట్టుకోవాలి అంతే ,కొద్దిగా ఉల్లిపాయముక్కలు ,కొంచెం మషాలా పొడి ,ఒకస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ ,కడిగిన
బియ్యం ,మసాలా దినుసులు కూడా కావాలి . నచ్చితే టమాట వేసుకోవచ్చు . లేకపోయినా ఫర్లేదు .
నెయ్యి ,నూనె సమానం గా తీసుకున్నాను ,షాజీర ,జీడిపప్పు వేసాను ,తర్వాత మసాలాదినుసులు వేసాను .
అవి వేగగానే ,ఉల్లిముక్కలు ,పచ్చిమిర్చి చీలికలు(కారం వెయ్యము కనుక మిర్చి ఎక్కువే వెయ్యచ్చు ) ,వేయించి ,టమాట ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయించాను ,అన్ని మసాలా దినుసులు కలిపి పొడి చేసిన మసాలా ఒకస్పూన్ వేసి
కడిగిన బియ్యం ,సరిపడా ఉప్పు వేసి ,ఒక కప్పు బియ్యానికి ఒకకప్పు కొబ్బరిపాలు ,ఒకకప్పు నీళ్ళు కలిపి
వుడికించాను . ఇది మంచి రుచిగా వుంటుంది . ఆలూ కుర్మాకాని ,చికెన్ కుర్మా కికాని మంచి కాంబినేషన్.
***************************
ఇది ఇంకా సులువుగా చేసుకునే మరో ''కొబ్బరి అన్నం ''2.
వండిన అన్నం ఒక కప్పు ,పచ్చి కొబ్బరి అరకప్పు , జీడిపప్పు ,ఎండుమిర్చి ,కరేపాకు ,ముఖ్యమైనది
దాల్చిన చెక్క పొడి ఒకస్పూన్ ,నెయ్యి ,నూనె సమపాళ్ళు లో తీసుకోవాలి . ముందుగా నెయ్యి ,నూనె
వేడి చేసి జీడి పప్పు వేయించాలి ,అందులోనే ఎండుమిర్చి ,కరేపాకు వేసి వేగగానే అన్నం వెయ్యాలి ,
అప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి వుప్పువేసి కొద్దిసేపు కలిపి దించెయ్యాలి .
ఉప్మా చెయ్యగానే మా పాప చుట్టు పక్కల కనపడకుండా మాయం అయిపోతుంది ,నాకూ నచ్చదు మరి
ఏమి చెయ్యను ,అసలు ఈ ఉప్మా ఎవరుకనిపెట్టేరో కానీ ... ఎందుకులెండి ఉప్మా ప్రియులు కోప్పడతారు .
అందుకే ఉప్మా చేసి నప్పుడు తప్పనిసరిగా ఇది చేస్తుంటాను . మీరు చేసి చూడండి నచ్చుతుంది .
*************************************************
Subscribe to:
Posts (Atom)